12-07-2025 07:30:49 PM
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ప్రాథమిక ఫలితాల ఆధారంగా ఉందని, తుది నివేదికను బహిర్గతం చేసే వరకు ఎవరూ తొందరపడి నిర్ధారణలకు రాకూడదని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... "ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పైలట్లు, సిబ్బంది భారతదేశంలో ఉన్నారు.
దేశంలోని పైలట్లు, సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను తను అభినందిస్తున్నాని, వారు పౌర విమానయానానికి వెన్నెముక, ప్రాథమిక వనరులు అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పైలట్ల సంక్షేమం, శ్రేయస్సును కూడా పట్టించుకుంటామని, ఈ దశలో ఎటువంటి నిర్ధారణలకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దాం" అని ఆయన అన్నారు."ఈ నివేదికను త్వరాలోనే వివరిస్తామని, ప్రాథమిక నివేదిక వచ్చింది. కానీ నిర్దిష్టమైన విషయం వచ్చే వరకు మనం వేచి ఉండాలి" అని తెలిపారు.
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ కూడా ఎఎఐబీ(Aircraft Accident Investigation Bureau) నివేదిక ఇంకా ప్రాథమికమేనని, ఈ సమయంలో తాము ఖచ్చితంగా ఏమీ చెప్పలేమని అన్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 - బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఘోర ప్రమాదానికి సంబంధించి ఎఎఐబీ నివేదికపై ఐఏఎన్ఎస్(IANS)తో మాట్లాడిన మంత్రి, ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రశంసనీయమైన పని చేసింది. గతంలో దేశంలో ఏదైనా హెలికాప్టర్ ప్రమాదం జరిగితే, బ్లాక్ బాక్స్ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వంత దేశంలోనే ఆ సౌకర్యం ఉందని మంత్రి అన్నారు. ఎఎఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం... ఎయిర్ ఇండియా విమానం 171 ఇంజిన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు త్వరితగతిన ఆపివేయబడ్డడంతోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. పైలట్లలో ఒకరు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో మరొకరిని ఇంధనాన్ని ఎందుకు ఆపివేశారని అడుగుతున్నట్లు వినవచ్చు, దానికి మరొక పైలట్ అతను చేయలేదని సమాధానం ఇచ్చాడని నివేదిక పేర్కొంది.