13-04-2025 09:00:02 PM
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దౌల్తాబాద్,(విజయక్రాంతి): తరాలు మారిన దళితుల జీవితాల్లో మార్పు రావడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపించిన మహానుభావుడని కొనియాడారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సామాజిక అభివృద్ధికి పాటుపడాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారిందన్నారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ దేశానికి స్ఫూర్తిగా హైదరాబాదు నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సంకెళ్లు వేయడం సరికాదని, నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిషేధం విధిస్తే సంకెళ్లు బద్దలు కొట్టి జయంతిని ఘనంగా నిర్వహిద్దామన్నారు. అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్య కుసుమం అసమానతలు అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ అని కొనియాడారు. తరతరాల భవిష్యత్తుకై రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. కెసిఆర్ దళిత బంధు పథకం మండలంలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేశామని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం కెసిఆర్ చేశారని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.