06-12-2025 06:41:36 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్య రంగానికే తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నగరంలోని టిడి గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు తన స్వంత నిధులతో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ ఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఆయన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను పొందాలనే లక్ష్యంతోనే ఈ డిజిటల్ స్టడీ మెటీరియల్స్ ను ఏర్పాటు చేశామని, భవిష్యత్తు కోసం విద్యార్థులు బలమైన పునాదులు నిర్మించుకోవాలన్నారు.
అందుకోసం మా వంతు సహకారం ఎల్లప్పుడూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రముఖ గ్రామీణ వైద్యులు పాఠశాల పూర్వపు విద్యార్థి శ్రీ సురేందర్ లక్ష రూపాయల విరాళాన్ని విద్యా నిధికి ఇచ్చి, తాను చదివిన పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని ఆయన కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సురేందర్ గారి కోరిక మేరకు ఆయన ఇచ్చిన విరాళం తోపాటు అవసరమైతే మరింత నిధులు కేటాయించి టిడి గుట్ట పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతులు, గదుల సదుపాయాలు, స్మార్ట్ లెర్నింగ్ పరికరాలు, అన్నీ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయిబాబా, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నాయకులు మునీర్, చిన్న, ఫఖృ, చంద్రమోహన్, గ్రామీణ వైద్యులు సురేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మణిరాం రాథోడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.