06-12-2025 07:13:01 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ముందుచూపుతో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి భవిష్యత్ తరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిదాతగా నిలిచారని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కృషితోనే పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందన్నారు. రిజర్వేషన్ల కారణంగా ప్రజాస్వామ్య దేశంలో పేద వర్గాలు అభివృద్ధి పథంలో నడవడానికి దోహద పడిందన్నారు. అంబేద్కర్ కృషిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.