విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్..
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంతో పాటు గ్రామాలలో ఉన్న ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడం లేదని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలను బంద్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, రెగ్యులర్ ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలను సొంత భవనాలు నిర్మించాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేసి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.






