09-10-2025 12:00:00 AM
జిల్లా సహకార, ఎన్నికల
వ్యయ నోడల్ అధికారి గంగాధర్
ఖమ్మం, అక్టోబరు 08 (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా సహకార అధికారి గంగాధర్ అన్నారు. జిల్లా సహకార, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి గంగాధర్ బుధవారం డి.పి.ఆర్.సి. భవనంలో జోనల్ అధికారులు, అకౌంటింగ్ బృందాలు, ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ., వీ.ఎస్.టి , వీ.వీ.ఎస్. బృందాలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సహకార , ఎన్నికల వ్యయ నోడల్ అధికారి గంగాధర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన మేర ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, అక్రమ నగదు బంగారం, ఇతర ముఖ్యమైన ఆభరణాలు, ఉచితాల పంపిణీని అరికట్టేందుకు ఈ బృందాలు కట్టుదిట్టంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల వ్యయ వివరాల నమోదు ఒక అంశమైతే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మరో ఎత్తుగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు. శిక్షణ లో జిల్లా ఆడిట్ అధికారి భూక్యా హుస్సేన్ నాయక్, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్ ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.