24-11-2025 06:29:37 PM
ఇంద్రవెల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారంటీల దరఖాస్తులను గతంలో స్వీకరించిందని, కానీ చాలా మందికి విద్యుత్ సబ్సిడీ రావడం లేదని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్ అన్నారు. సోమవారం విద్యుత్ సబ్సిడీ చెల్లించాలని TAGS వాల్గొండ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండల ఎంపీడీవోకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో చాలా మంది లబ్ధిదారులకు కరెంటు మీటర్లు లేకపోవడంతో గృహ జ్యోతి పథకం కింద వారి వివరాలను పొందుపరచలేదన్నారు.
ఈ మధ్యకాలంలో కొత్తగా ఇండ్లల్లో కరెంటు మీటర్లను బిగించారనీ, అయినప్పటికీ గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలను ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు చేయలేదన్నారు. దీనివల్ల పేద ప్రజలు 200 యూనిట్ల ఉచిత కరెంటు లబ్ధిని పొందలేకపోతున్నారు. కాబట్టి కొత్తగా మీటర్లు ఉన్న వారిని గుర్తించి గృహ జ్యోతి పథకం కింద వివరాలను నమోదు చేసి లబ్ధి చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు కినక లచ్చు, ఆత్రం భీమ్రావు, తినక ముపతిరావు, భీమ్రావు మెస్రం చిత్తూ, సోనేరావు, జ్యోతిరావు, మోహన్, దేవరావు పాల్గొన్నారు.