calender_icon.png 21 August, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి

21-08-2025 12:20:50 AM

జిల్లా కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్

మునగాల, ఆగస్టు 20 : ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాల , వ్యక్తిగత పరిశుభ్రతలకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం మండలంలోని తాడ్వాయి  గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.

ఈ సందర్బంగా  కలెక్టర్ గ్రామంలో వీధులలో తిరుగుతూ మురికి కాలువలు, ఇంటి ముందు ఇంకుడు గుంట లేకుండా వాడుకున్న  నీరు రోడ్లపై ప్రవహించటం పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరంతో ఇబ్బంది పడి తగ్గిన వ్యక్తితో ఆరోగ్యం ఎలా ఉంది? ఏ హాస్పిటల్ లో చూపించుకున్నావు? అని అడిగి తెలుసుకున్నారు.

ఎక్కువ మంది గ్రామ పంచాయతీ సిబ్బందిని  ఉపయోగించుకొని ప్రతి బజారులో జేసిబి ల ద్వారా నిరుపయోగ  మొక్కలను తొలగించాలని, ప్రతి బజారు లో డెమోపాస్ స్ప్రే, బ్లీచింగ్ వెదజల్లాలని, ఫాగింగ్ చేయాలని ఎంపిడిఓ ను ఆదేశించి తక్షణ సహాయం కొరకు 50,000 రూపాయల చెక్ ని అందజేశారు. మనుషులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావని ప్రజలు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

తాజా ఆహరం తీసుకోవాలని, కాచిచల్లార్చి వడపోసిన నీరు త్రాగాలని ఇలా చేయటం ద్వారా సీజనల్ వ్యాధులు అరికట్టవచ్చని సూచించారు. గ్రామం లో నిర్వహిస్తున్న జ్వర సర్వే పై డాక్టర్లను అడగగా జూలై నుండి ఇప్పటివరకు 6 వ విడత సర్వే నడుస్తుందని, 93 మంది జ్వరం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

వాటిలో 5 డెంగ్యూ కేసులు నమోదు అవ్వగా, ప్రస్తుతం 2 ఆక్టివ్ గా ఉన్నారని  వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, వైద్యులు శ్రీశైలం, వినయ్, వైష్ణవి, పంచాయతీ కార్యదర్శి రాము, ఎ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.