calender_icon.png 19 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పథకం ప్రజలకు చేరాలి

19-09-2025 01:21:41 AM

  1. బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి 
  2. వరద ప్రాంతాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
  3. ‘దిశ’భేటిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  4. అధికారుల మధ్య సమన్వయ లోపంపై కేంద్ర మంత్రి అసహనం  

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కాగా అందాలని, వాటి అమలులో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, బం జారాహిల్స్ కాదని, అసలు నగరం బస్తీల్లోనే ఉందని పేర్కొన్నారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఆయన అధ్యక్షతన జరిగిన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలు తీరును ఆయన సమీక్షించారు.

ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా కలెక్ట ర్ హరిచందన దాసరి, జీహెచ్‌ఎంసీ, వాటర్ వరక్స్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, ఇకపై సమష్టిగా పనిచేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరానికి నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే.

కానీ ఉన్న నిధులను సమర్థంగా వినియోగించుకోవాలి. నిజమైన హై దరాబాద్ బస్తీలు, మురికివాడల్లోనే ఉంది. అక్కడి ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల నాంపల్లి, సనత్నగర్లో నాలాలో కొట్టుకుపోయి చనిపోవడం అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఏ బస్తీకి వెళ్లినా డ్రైనేజీ ఉప్పొంగి, వర్షపు నీటితో కలిసిపోతోంది.

ఇది ప్రజారోగ్యానికి పెను ముప్పు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 36 అంగన్‌వ్వాడీ కేంద్రాలను దత్తత తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధం గా, స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్.. కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చే యాలని, మహిళలు, బాలికల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించా రు. 

జిల్లాలో వివిధ కేంద్ర పథకాల కింద అందించిన రుణాల పురోగతిని మంత్రి సమీక్షించారు. సమావేశంలో లేవనెత్తిన అం శాలపై ప్రత్యేక దృష్టి సారించి, కేంద్ర, రాష్ట్ర పథకాలు అర్హులకు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, వాటర్ వరక్స్ ఎండీ అశోక్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.