calender_icon.png 15 August, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాణి రాంపాల్ వీడ్కోలు

25-10-2024 12:00:00 AM

రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. భారత జట్టులో రాణి రాం పాల్ జెర్సీ నెంబర్ 28కు శాశ్వత వీడ్కో లు పలికిన హాకీ ఇండియా.. ఆమె సేవలకు గాను రూ.10 లక్షల నజరానా బహుమతిగా అందించింది.

2008లో 14 ఏళ్ల వయసులో అంతర్జాతీయ హాకీ కెరీర్‌ను మొదలుపెట్టిన రాణి రాంపాల్ 16 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. టీమిండియా తరఫున 254 మ్యాచ్‌లాడిన రాణి120కి పైగా గోల్స్ కొట్టడం విశేషం. 2018లో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్స్ చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది.

ఇక 2018 ఆసియా గేమ్స్‌లో రజతం సాధించిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇక ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్యం చేజార్చుకుంది. 

హాకీ స్టిక్ కొనలేని దుస్థితి..

ఉత్తర్ ప్రదేశ్‌లోని షహాబాద్ పట్టణానికి చెందని రాణి రాంపాల్ కడు పేదరికంలో పెట్టి పెరిగింది. పేదరికం ఆమె ప్రతిభను ఆపలేకపోయింది. ఆరేళ్ల వయసులోనే హాకీపై మనసు పారేసుకున్న రాణి రాంపాల్ హాకీ స్టిక్‌ను పోలిన కర్రతో ఆటను మొదలుపెట్టింది. రోజుకు రూ. 80 కూలీ సంపాదించే కుటుంబం నుంచి వచ్చిన రాణి హాకీ స్టిక్ కూడా కొనలేని దుస్థితి.

జిల్లా స్థాయి కోచ్ ‘హాకీ ఎందుకంటూ’ హేళన చేసినప్పటికీ మొక్కొవోని దీక్షతో విరిగిన హాకీ స్టిక్‌తోనే ప్రాక్టీస్ కొనసాగించి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యింది. 2008లో జాతీయ జట్టుకు ఎంపికైన రాణి రాంపాల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2020లో క్రీడా విభాగంలో అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డును అందు కున్న ఆమెను అదే ఏడాది ‘పద్మశ్రీ’ వరించింది.