22-12-2025 02:44:38 AM
కంగ్టి, డిసెంబర్ 21(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగం శివారులోని సమర్ద్ కోటేక్స్ కాటన్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మినీ ట్రాక్టర్ ద్వారా పత్తిని తరలిస్తుండగా ట్రాక్టర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంట లు ఫ్యాక్టరీలోకి క్షణాల్లో వ్యాపించి, చుట్టు పక్కల ఉన్న పత్తికి అంటుకున్నాయి. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. వెంటనే అగ్నిమపక సిబ్బందికి సమాచారం అందించారు.
మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న ఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి, కంగ్టి సీఐ, ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నా రు. సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఫ్యాక్టరీవారు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టమూ జరగలేదు.