16-05-2025 01:05:58 AM
-బీబీనగర్ స్టేషన్లో నిలిపివేత
-సడన్ బ్రేక్తో షార్ట్ సర్క్యూట్!
యాదాద్రి భువనగిరి, మే 15 (విజయక్రాంతి): ప్యాసింజర్ రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గుర్తించి, రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్లో రైలును నిలిపివేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ ఈ ప్యాసింజర్ రైలు గురువారం ఉదయం బయలుదేరింది.
ఇంజన్ కింది భాగంలో పట్టాలకు పైన బండి ఇనుప చక్రాలపై భాగం గుండా పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు బీబీనగర్లో రైలును నిలిపి ప్రయాణికులను దించి పరిశీలించారు.
రైలు కింద భాగం గుండా మంటలు అప్పుడే మొదలవుతున్నాయి. మంటలు తీవ్ర రూపం దాల్చకముందే ఆర్పి వేయాలని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పి వేశారు. ప్రయాణికులు గమనించకుంటే రైలు కాచిగూడకు పోయేసరికి మంటలు గాలికి తీవ్ర రూపందాల్చి అన్ని బోగీలకు అంటుకొని పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కాగా రైల్ సడన్ బ్రేక్తో షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నట్టు తెలుస్తున్నది.