27-09-2025 01:49:40 AM
గజ్వేల్, సెప్టెంబర్ 26: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గజ్వేల్ మహంకాళి కాలిక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు పసుపుతో అమ్మవారిని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కాలువ శ్రీధర్ రావు మాట్లాడుతూ గజ్వేల్ మహంకాళికి దేవి భాగవతంలో సూచించిన విధంగా వివిధ అలంకారాలలో నవరాత్రి పూజలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
భక్తుల సహకారంతో ఆలయాన్ని దిన దిన అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కాగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యధావిధిగా అమ్మవారికి చతుషష్టి ఉపచార పూజలు, చండీ హవనం, కుంకుమార్చన, గోపూజ, నిత్యాన్నదానంనిర్వహించారు.