04-09-2025 09:17:26 PM
ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
మణుగూరు (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు 14 గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకులు సదానందం మాట్లాడుతూ... సంవత్సరాలు పైబడి ఎండకు ఎండి వానకు తడిసి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పని ఎక్కువ, జీతం తక్కువగా ఉందని, చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారన్నారు.
తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేల జీతం ఇవ్వాలని పెండింగ్ జీతాలు తక్షణమే విడుదల చేయాలని, గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్, సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పనిలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం లేదా పంచాయతీ వైద్య సేవలు అందించి, నాణ్యమైన గ్లౌజులు, బూట్లు, మాస్కులు, నూనె, సబ్బులు, సరఫరా చేయాలని కోరారు. ఈ ధర్నాలో నాయకులు రంగా, బండారి సారిక, రాములు, మంగమ్మ, రమేష్, వెంకటేశ్వర్లు కార్మికులు పాల్గొన్నారు.