20-12-2025 02:15:15 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వర్సిటీల్లో కాల్పుల నేపథ్యంలో నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ, ఎంఐటీ కాల్పుల ఘటనలో నిందితుడు ఈ లాటరీ ద్వారానే అమెరికాలోకి ప్రవేశించాడన్న సమాచారంతో ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోర్చుగల్కు చెందిన క్లాడియో నెవెస్ వాలెంటే (48)గా అక్కడి పోలీసులు గుర్తించారు. నిందితుడు 2017లో డైవర్సిటీ వీసా లాటరీ ద్వారా అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందాడని విచారణలో వెల్లడైంది. బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
అలాగే ఒక ఎంఐటీ ప్రొఫెసర్ కూడా ఈ నిందితుడి చేతిలో హతమయ్యారు. గురువారం సాయంత్రం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ స్పందిస్తూ.. ఇలాంటి దుర్మార్గులను దేశంలోకి అనుమతించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాల మేరకు వీసా లాటరీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.