calender_icon.png 20 December, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా?

20-12-2025 01:56:33 AM

  1.   66శాతం ప్రజాదరణ ఉంటే నా సవాల్ స్వీకరించండి
  2. ఆ పదిమంది ఎమ్మెల్యేలతో సీఎం రాజీనామా చేయించాలి
  3. ఎన్నికల్లో ఎవరి శాతం ఎంతో ప్రజలే తేలుస్తారు 
  4. స్పీకర్ ముందు పచ్చి అబద్ధాలా? పదవుల కోసం ఇంత దిగజారుడా?
  5. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 19 (విజయక్రాంతి):  ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. మీకు నిజంగానే 66 శాతం ప్రజాదరణ ఉంటే నా సవాల్ స్వీకరించండి.  మా పార్టీ నుంచి మీరు సంత లో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రండి. అప్పుడు ప్రజలే చెప్తారు.. ఎవరి శాతం ఎంతో.. ఎవరి బతుకెంతో.. ఎవరి సత్తా ఎందో.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రా’  అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కేటీఅర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వా మిక విధానాలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరిని కేటీఆర్ కడిగిపారేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని కేటీఆర్ విమర్శించారు. ‘నిన్న హైదరాబాద్ ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మె ల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కేవలం ‘గడ్డిపోచ’ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ‘బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహు ల్‌గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు..

ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబు తున్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారు

రైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రె స్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెం డా వైపే నిలిచారని స్పష్టం చేశారు.‘ సిరిసిల్లలో 117 పంచాయతీలకు 80 చోట్ల బీఆర్‌ఎస్ గెలవడమే దీనికి నిదర్శనం. ముఖ్యమంత్రి, మం త్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. పల్లెలు బాగుపడా లన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ప్రజలు మరోసారి తేల్చి చెప్పా రు’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తలకు భరోసా.. 

బెదిరింపులు, ఫోన్ కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలి. వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమో దు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటాం. పాతతరం అనుభవం, కొత్త రక్తం కలిసేలా చాకుల్లాంటి పిల్లలతో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాం’ అని ప్రకటించారు. రాబోయే జిల్లా పరిష త్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగించాలని కేటీఆర్  పిలుపునిచ్చారు.