18-10-2025 12:00:00 AM
రాంకీ ఏజెన్సీకి నోటీసు జారీ చేసిన జీహెచ్ఎంసీ
ఒప్పందం రద్దుతో పాటు జరిమానాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పేరుకుపోయిన కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వ్యర్థాలను హైదరాబాద్ సీ అండ్ డీ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ( రాంకీ ఏజెన్సీ) సకాలంలో తొలగించకపోవడం పట్ల జీహెచ్ ఎంసీ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీ అండ్ డీ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నోటీసు జారీ చేశా రు.
నగరంలోని సర్కిల్ అధికారుల, ఏఎంఓహెచ్, డీఈఈ (ఎస్డబ్ల్యూఎం) ల పదే పదే విజ్ఞప్తుల తర్వాత కూడా వ్యర్థాల తొలగింపు పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 25, జూలై 30 తేదీల్లో కూడా ఇలాంటి నిర్లక్ష్యంపై అధికారులు నోటీసులు జారీ చేశారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరిస్తూ, సంస్థ తక్షణమేహైదరాబాద్ సీ అండ్ డీ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సత్వరమే స్పందించి, వాహనాలతో పేరుకుపోయిన సీ అండ్ డీ వ్యర్థాలను తొలగించకపోతే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
క్లాజ్ 7.4 మేరకు ఒప్పందం రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.గ్రేటర్ హైదరాబాద్ నగర పరిశుభ్రత తమకు ప్రధానం అని , ప్రజల సౌకర్యార్థం వెంటనే సంస్థ సీ అండ్ డీవ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు.