24-07-2025 12:21:45 AM
విద్యార్థులకు గీతం ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా సూచన
పటాన్ చెరు, జులై 23 : విశ్వవిద్యాలయం కేవలం వినోదం కోసం కాదని, అంకితభావం పరివర్తన కోసం నిర్ధేశించిన ప్రదేశమని, ఇక్కడున్న అత్యుత్తమ వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకుని పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగాలని మొదటి సంవత్సరం విద్యార్థులకు గీతం ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి ఏడాది విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమాన్ని బుధవారం ఆయన వర్చువల్ గా ప్రారంభించారు.
కొత్తగా చేరిన విద్యార్థులను విశ్వవిద్యాలయం యొక్క విద్యా వ్యవస్థ, పలు విభాగాలు, ప్రాంగణ జీవితం, విద్యార్థి క్లబ్ లు, కెరీర్ మార్గదర్శక సూచనలు, క్రీడా మౌలిక సదుపాయాలను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ వరకు కొనసాగనుంది. డాక్టర్ ఎర్రోల్ డిసౌజా మాట్లాడుతూ తొలి ఏడాది విద్యార్థులను గీతం కుటుంబంలోని హృదయపూర్వకంగా స్వాగతించారు.
గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు మాట్లాడుతూ దాదాపు 85 శాతం మంది అధ్యాపకులు పీహెచ్ డీ డిగ్రీలను కలిగి ఉన్నారన్నారు. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం విశ్వవిద్యాలయ స్థాయిలో రూ.250 కోట్లు, ఒక్క హైదరాబాదు ప్రాంగణంలో రూ.30 కోట్లతో అత్యాధునిక ప్రయోగశాలలను నెలకొల్పినట్టు చెప్పారు.
గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. రామశాస్త్రి, వివిధ ఇంజనీరింగ్ విభాగాధిపతులు, సినియర్ అధ్యాపకులను విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ ఇండక్షన్ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ పి.త్రినాథరావు సమన్వయం చేశారు. కెరీర్ గైడెన్స్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మమతా రెడ్డి, గీతం పూర్వ విద్యార్థులు కొత్త బ్యాచ్ విద్యార్థులతో మాట్లాడి తగిన మార్గదర్శనంచేశారు.