26-09-2025 12:40:54 AM
మంచిర్యాల, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఏఎన్ఎంలపై అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని చార్వక హాల్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలపై అధిక పని భారం మోపుతుందని, గత ఏడాది రెండవ ఏఎన్ఎంలకు పరీక్ష పెట్టినా నేటికి ఫలితాలు ఇవ్వకుండా , రెగ్యులరైజేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఎఫ్.టి.ఏ, 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నా స్పెషల్ ఇంక్రిమెంట్ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టిందన్నారు.
రెగ్యులర్ ఏఎన్ఎంలకు 28 ఏళ్లు గడిచిన ప్రమోషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేండ్లుగా వ్యాక్సిన్ కారియర్ డబ్బులు కూడా అధికారులు చెల్లించడం లేదని, ఇప్పటికైనా సెకండ్ ఏఎన్ఎంలు పరీక్ష ఫలితాలు ప్రకటించి వెంటనే పోస్టింగులు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్.సి.డి ఆన్ లైన్ చేయాలంటూ ఏఎన్ఎంల పైన అధికారుల వేధింపులు ఆపాలని, లేకుంటే డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మౌలాలి పద్మ, మంజుల, ధనలక్ష్మి, సంధ్యారాణి, పుష్ప, మమతా, రాణి, భాగ్యలక్ష్మి, హరిత, విజయలక్ష్మి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.