26-09-2025 01:27:30 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ “సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా”గా కొనసాగాలంటే పరిశోధనను బలోపేతం చేసి, ఎగుమతులను విస్తరించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పల్లాలో సీడ్స్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘హైదరాబాద్ సీడ్ కాన్క్లేవ్ -2025’ కార్యక్రమా నికి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీడ్ కంపెనీలు దేశ నిర్మాతలని, వారికి రాష్ర్ట ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వ్యవసాయంలో నాణ్యమైన విత్తనం అత్యంత ముఖ్యమైన ఇన్పుట్ అని పేర్కొన్నారు. రోజూ వ్యవసాయం చేసే రాజకీయ నాయకుడిగా, రైతుల కష్టాలను మంత్రి తుమ్మల బాగా అర్థం చేసుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
డిసెంబర్ 2023 నుంచి ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లో తెలంగాణ రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించిందని, మంత్రి తుమ్మల నేతృత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ వరి ఉత్పత్తి రాష్ర్టంగా అవతరించిందన్నారు. తెలంగాణ సీడ్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తోందని, ఫిలిప్పీన్స్కు ఇప్పటికే విత్తనాలు, బియ్యం ఎగుమతి చేస్తున్నామని ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బుర్కినాఫాసో, ఇతర ఆఫ్రికన్ దేశాలకు కూడా ఎగుమతుల ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎన్.వి. రామకృష్ణతో పాటు సీడ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు.