25-08-2025 11:49:57 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉస్మానియా విశ్వవిద్యాలయ పర్యటనకు ముందు విద్యార్థులను ముందస్తుగా నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఖండించారు. ఇటువంటి చర్యలతో, ముఖ్యమంత్రి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి పాలనను అమలు చేస్తున్నారని, విద్యార్థులపై ఇటువంటి అతిక్రమణలను సహించబోమని హెచ్చరించారు. విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు (Thanneeru Harish Rao)డిమాండ్ చేశారు.
ఒక్క విద్యార్థి మీద పోలీసు లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హరీశ్ రావు హెచ్చరించారు. ఇందుకేనా విద్యాశాఖను, హోం శాఖను మీ వద్ద పెట్టుకున్నదని ప్రశ్నించారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణకు మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తోందని చురకలంటించారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అని ప్రశ్నించారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి, రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం. కేసీఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలలుగా నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. 22నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని(Congress government) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని సూచించారు. ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరని పేర్కొన్నారు. పోలీసు బలం, బలగంతో విద్యార్థుల నిరసన జ్వాలలను చల్లార్చలేరన్న హరీశ్ రావు ఉస్మానియా విద్యార్థి, నిరుద్యోగులు సింహాలై గర్జిస్తారని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎక్కడిక్కడ నిలదీస్తారని స్పష్టం చేశారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు.