25-08-2025 03:04:42 PM
బెల్లంపల్లి జీఎంకు ఐఎన్టీయూసీ లీడర్ల వినతి
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కోల్ ఇండియా పోటీ(Coal India competition)ల్లో మెడల్స్ సాధించిన ప్రతిభ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఐఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లి జీఎంను కలిసి ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సంగెం ప్రకాశరావు వినతి పత్రం అందజేశారు. WPS & GA, BPA ఏరియా 2025-26 క్రీడా కమిటీలో కోల్ ఇండియా పోటీలలో మెడల్స్ సాధించిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఏర్పడబోయే వార్షిక WPS & GA క్రీడా కమిటీలో కార్పొరేట్ గైడ్లైన్స్ ప్రకారం కోల్ ఇండియాలో మెడల్స్ సాధించిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు మొదటి ప్రాధాన్యతగా, వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలన్నారు.
క్రీడలు, కళారంగాలను బెల్లంపల్లి ఏరియాలో మరింతగా ప్రోత్సహించాలని మనవి చేశారు. గత సంవత్సరం కార్పొరేట్ గైడ్ లైన్స్ విస్మరించి, కోల్ ఇండియా స్థాయిలో ప్రతిభ చూపని కొందరికి కమిటీలో స్థానం కల్పించారని, ఇది నిజమైన ప్రతిభావంత క్రీడాకారులను తీవ్ర నిరుత్సాహాపరిచిందన్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా, ఈసారి ప్రతిభావంతులైన క్రీడాకారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాయింట్ సెక్రెటరీ మిట్టపల్లి కుమార స్వామి, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ సోగాల వామన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బోయినా రాజేష్, మేడ మహేష్ రెడ్డి పాల్గొన్నారు.