తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు(Telangana rains) భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంటూ 30 నుంచి 40 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.
రేపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావారణ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి జోరు వాన కురుస్తుంది. దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు, బైక్ రైడర్స్ కు ఇబ్బందిగా మారింది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటిలో మునిగిన వారిని హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వానలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.






