25-01-2025 12:00:00 AM
ఫైనల్లో చెన్నై జట్టుపై గెలుపు
హైదరాబాద్: 47వ ఆలిండియా రాజీవ్ గాంధీ అండర్-19 టీ20 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ నిలిచింది. ఎల్బీ స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టును క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అభినందించారు. అంతకముందు వి.హనుమంత రావు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం హైదరాబాద్, చెన్నై ఆటగాళ్లతో వీహెచ్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.