24-01-2026 12:00:00 AM
భద్రాద్రికొత్తగూడెం, జనవరి 23, (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తామని, పథకాల అమలులో ఎలాంటి వివక్ష ఉండబోదని, పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 232 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 2.32 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫాలో ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాము నిరంతరం కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
కేవలం ఒక్క రోజులోనే ఐదు మండలాల ప్రజలకు ఇంత భారీ స్థాయిలో నిధులు విడుదల కావడం నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్లు పుల్లయ్య, శిరీష, కృష్ణ, కృష్ణప్రసాద్, సిపిఐ నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, యూసుఫ్, తోట రాజు, మాచర్ల శ్రీనివాస్, పొదిలి శ్రీనివాస్, మూడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.