09-12-2025 01:33:05 AM
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలి
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని జోగులాంబ జోన్-2 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ హెచ్చరించారు. సోమవారం నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
తప్పుడు ప్రచారం చేసే వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అశాంతి సృష్టించే ట్రబుల్ మేకర్స్పై ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ మద్యం రవాణా, బెల్టు షాపుల్లో అమ్మకాలు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చట్టవ్యతిరేక చర్యల విషయంలో ఎలాంటి సడలింపు ఇవ్వవద్దని అధికారులకు ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అదనపు ఎస్పీ ఎన్వీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, అన్ని పోలీస్ స్టేషన్ ఎస్త్స్రలు పాల్గొన్నారు.