09-12-2025 02:26:09 AM
2047 నాటికి సాధిస్తాం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్లోబల్ సమ్మిట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణ 2047 నాటికి దేశంలో జీరో ఎమిషన్ మొబిలిటీకే దిక్సూచిగా మారడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రీన్ మొబిలిటీ నినాదం కాదు.. తెలంగాణ భవిష్యత్ వృద్ధికి పునాది అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
జీవో 41 ప్రకారం 2026 డిసెంబర్ 31 వరకు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములపై 100 శాతం మినహాయింపు అమల్లో ఉందని తెలిపారు. దీనివల్ల ఈవీ వినియోగం 0.60 శాతం (2023) నుండి 1.39 శాతం (2025)కు పెరిగిందని చెప్పారు. రెండు ఏళ్లలో రూ.806.85 కోట్లు విలువైన పన్ను రాయితీలతో 1.59 లక్షల ఈవీలకు మద్దతు లభించిందన్నారు.
జిల్లాల వారీగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశలో 15 స్టేషన్లకు టెండర్లు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో స్థిరమైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం 20,000 ఎలక్ట్రిక్, 10,000 సీఎన్జీ, 10,000 ఎల్పీజీ ఆటోలు, 25,000 రెట్రోఫిట్ ఈవీ ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.