13-01-2026 01:28:46 AM
మహబూబ్నగర్, జనవరి 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాను తొలగించే ప్రయ త్నం చేసినా బీఆర్ఎస్ అగ్ని రాజేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘భవిష్యత్తు అంతా మనదే, కాస్త ఓపిక పట్టండి’ అని కార్యకర్తలకు భరోసానిచ్చారు. మంగళవారం మహబూబ్నగ ర్లో బీఆర్ఎస్ సర్పంచులను కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు ఎవ్వరు కూడా భయపడకూ డదని త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు విజయం అందించాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి పాలమూరుకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తాము సబ్జెక్ట్ మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘నేను మీ పాలమూరు బిడ్డను ఆశీర్వదించండి’ అంటూ మాయమాటలు చెప్పి రేవంత్రెడ్డి సీఎం సీటులో కూర్చున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి నిజాయతీగల మోసగాడని, ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం ఉందన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కూర్చున్నారని విమర్శించారు.
రేవంత్రెడ్డి పండపెట్టి తొక్కుతా అని అంటుంటారని అయితే.. రైతుబంధు మూ డు పంటలకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రైతన్నను పండబెట్టి తొక్కారని విమర్శించారు. ఎప్పుడు ఇస్తున్నాడో ఎప్పుడు ముంచుతున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా పాలమూరు బిడ్డను అభివృద్ధి చేస్తాను అని చెబుతున్న రేవంత్ రెడ్డి 10% మిగిలిపోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందు కు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రూ.30 వేల కోట్లను ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించాలని లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు.
బూతులు మాట్లాడడంలో రేవంత్ రెడ్డిని మించిన వారు ఎవరు లేరని అనుకుంటారని ఆయన ఒక్క భాషలో మాట్లాడితే నాలుగు భాషల్లో మాట్లాడే తెలివితేటలు తమకు ఉన్నాయని సమాజంలో గౌరవమర్యాదలతో అందరి మన్ననలు పొందాలని లక్ష్యంతో అలా మాట్లాడడం లేదని తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఏ మొహం పెట్టుకొని పాలమూరుకు వస్తారని ఆయన చేసింది ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.
నార్లాపూర్, ఏదుల, కరువేనా, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్లలో 90 శాతం పనులను పూర్తిచే శామని, ఏనుగు బయటికి వెళ్ళింది కేవలం తోకనే మిగిలింది అనే రీతిలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు ఉన్నా యని అవి కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు కల్యాణ లక్ష్మి పథకం కింద బంగారం ఇచ్చే మనుషులుకాదని ఉన్న పుస్తెలతాడు కూడా ఎత్తుకెళ్లే వారిని కేటీఆర్ విమర్శించారు. చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానన్న సీఎం లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యా భరోసా కార్డులను అందిస్తానన్నారని, రూ12,500 కోట్ల ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉందన్నారు.
శాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేశాం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా తాము శాస్త్రీయంగా ఏర్పాటు చేశామని.. శాస్త్రీయంగా జరగలేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెపుతున్నారని ఇప్పుడు నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలను తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ ఒక్క జిల్లాను తొలగిస్తామని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ అగ్నిని రాజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్గౌడ్, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఇంతియాజ్ ఇసాక్, అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, కోడుగల్ యాదయ్య, శివరాజ్, రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.