calender_icon.png 28 August, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లిలో ఎడతెరిపిలేని వర్షం

28-08-2025 11:36:33 AM

పొంగి ప్రవహిస్తున్న వాగులు, అప్రమత్తమైన అధికారులు 

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని గణపురంలో అత్యధికంగా 98.4, రేగొండలో 81.0, మొగుళ్లపల్లిలో 72.0, పలిమెల లో 63.8, చిట్యాల లో 61.2, కాటారంలో 58.6, టేకుమట్లలో 58.2, మలహర్ రావు లో 52.4, భూపాలపల్లిలో 30.4, మహాదేవపూర్ లో 29.6, మహా ముత్తారంలో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 

అధికారులను అప్రమత్తం కలెక్టర్

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ  మొరంచపల్లి వాగు ఉధృతి అధికమైందని, ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక వద్ద  ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని  సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, యంత్రాంగానికి సహకరించాలని, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.