21-05-2025 08:51:50 PM
డబ్బులు ఇస్తే, వెనక వచ్చినాయి కూడా కాంటాలు పెడుతున్నట్లు ఆరోపణ..
అన్నారం సొసైటీ కేంద్రంపై కలెక్టర్ విచారణ చేపట్టాలని రైతుల డిమాండ్..
తుంగతుర్తి (విజయక్రాంతి): ఆరుకాలం రైతు కష్టపడి పండించిన పంటను ధాన్యం కొనుగోలు సెంటర్కు తీసుకువెళ్లి నెలరోజులు గడుస్తున్న, వెనక పోసిన రైతుల కాంటాలను సొసైటీ యజమాని మహేష్ ఇష్టారాజ్యంతో ప్రవర్తించడంతో ఆవేదనకు లోనై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఉప్పుల వెంకన్న కోపోద్రిక్తుడై బుధవారం మధ్యాహ్నం తన ఒంటిపై పెట్రోల్, తన వరి కుప్పపై పెట్రోల్ పోసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అన్నారం గ్రామానికి చెందిన ఉప్పుల వెంకన్న గత నెల రోజుల క్రితం సొసైటీలో వడ్లు పోశాడు.
తనకన్నా వెనక తెచ్చిన వారిని కాంటాలు వేశాడని ఆరోపిస్తూ, బుధవారం మధ్యాహ్నం ఒక్క సారిగా వాతావరణం మారి వర్షం రావడంతో ధాన్యం వర్షానికి తడిసిపోగా ఆవేదనకు లోనై ఒంటిపై, తన వరికుప్పపై పెట్రోల్ పోసుకోగా ప్రక్కన ఉన్న రైతులు తక్షణమే దగ్గరకు వచ్చి ఎటువంటి ప్రమాదం జరగకుండా రైతును కాపాడడం జరిగింది. ఏది ఏమైనా గతంలో కూడా అన్నారం ఐకెపి సెంటర్లలో కూడా ఓ రైతు ఈ విధంగానే ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. జరిగిన సంఘటన సమాచారం మేరకు తుంగతుర్తి ఎస్సై క్రాంతి పోలీస్ సిబ్బందితో వెళ్లి, రైతుతో మాట్లాడి శాంతింప చేశారు. జరిగిన సంఘటనపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా విచారణ జరిపి నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడుతున్న సొసైటీ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.