06-11-2025 12:34:22 AM
అశ్వాపురం, నవంబర్ 5, (విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మా ఆస్తి మా హక్కు నినాదంతో బుధవారం ఓరుగంటి వీరయ్య భవన్లో సమావేశమయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని తాము గెలిపించిన తర్వాత ఆ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ఆస్తిని కూడా ఆక్రమించిన ఘనత రేగా కాంతారావుదే అని విమర్శించారు.
కాంతారావు అంటే ఎవరో తెలియని రోజుల్లో కార్యకర్తలు కష్టపడి గెలిపించగా, గెలిచిన తర్వాత పార్టీకి ప్రతీకగా ఉన్న మణుగూరు ఇందిరా భవన్ను తెలంగాణ భవన్గా రంగులు మార్చి ఆక్రమించడం అన్యాయం అని వారు పేర్కొన్నారు. అన్యాయంగా ఆక్రమించిన పార్టీ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కార్యకర్తల హక్కు, ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. ఇన్నాళ్లు సమయానుకూలంగా వేచి చూశాం,ఇప్పుడు మా ఆస్తి మాకు దక్కడం సంతోషకరం అని పేర్కొన్నారు.
కార్యాలయంపై కాంగ్రెస్ పెద్దలు గతంలో స్వాధీనం చేసుకుంటామని ఇచ్చిన హామీని, నేడు కార్యకర్తలు నెరవేర్చారని వారు అన్నారు. కార్యాలయం కాంగ్రెస్ పార్టీదే అనడానికి అన్ని చట్టబద్ధ ఆధారాలు ఉన్నాయి. ఇకనైనా మీ అహంకారం తగ్గించి తప్పు ఒప్పుకోవడం మంచిది. మాకు భయం లేదు, ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయం అని మండల నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, బట్టా సత్యనారాయణ, లంకమల్ల కొండలరావు, గాదె వెంకటరెడ్డి, మాదినేని రాంబాబు, ఎక్కటి సత్యనారాయణ రెడ్డి, సబ్కా చిన వీరయ్య, కాకా రాములు, బచ్చు వెంకటరమణ, సోడి వెంకటేశ్వర్లు, తోట సత్యనారాయణ, కన్నెబోయిన నాగరాజు, బేతం బాబు, బొబ్బాల వీరన్న, వేముల విజయ్, మేకల అంజిబాబు, బూతం వెంకన్న, గొల్లపల్లి నరేష్, రావులపల్లి నరసింహారావు, ఎస్కె. మోసీన్, కోలా శశికాంత్, షారుక్ పాషా, మారం మల్లిఖార్జున రావు, నారాయణరెడ్డి తదితరులుపాల్గొన్నారు.