22-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే సవితి ప్రేమ
మరిపెడ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో నిజమైన పేదవాడికి ఇల్లు దక్కడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు కట్టిస్తామన్నా, అర్హులైన పేదలకు ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల జాడ లేదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని చింతలగడ్డ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశామని తండాకు చెందిన నిరుపేదలు ఆంగోత్ బోడియా, శాంతి, మౌనిక, శివ, తేజ, బిచ్చ, రవీందర్, వెంకన్న, శ్రీను, సురేష్, సోనా, కళ్యాణ్, శ్రీకాంత్ తదితరులు ఆదివారం పేర్కొన్నారు.
చింతల గడ్డ తండా లో500 మంది జనాభా ఉండగా, 384 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో 90 శాతం ఓట్లు అధికార పార్టీకే ఓటు వేశామన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మా తండా పై అధికార పార్టీకి దయ లేదన్నారు. తండాలో 15 మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వారందరూ ఎన్నో ఏళ్ల నుంచి పూరిగుడిసెలలోనే నివాసం ఉంటున్న మనీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలైన గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం అనేకసార్లు డోర్నకల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ, చింతలగడ్డ తండా పైన సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా తండాకు వచ్చిన దాఖలాలే లేవని వాపోయారు. ఇప్పటికైనా మా తండాను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వారు వేరుకుంటున్నారు.