16-08-2025 12:09:14 AM
-విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ సుబ్బారావు
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశ అభివృద్ధికి యువత నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని, సమస్యల గుర్తింపుతో నూతన ఆవిష్కరణలు సాధ్యమని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఆఫీస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు.
కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు మాట్లాడుతూ.. నిజమైన స్వాతంత్య్రం అంటే ప్రతి పౌరుడు స్వేచ్ఛను అనుభవించడమేనని చెప్పారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని సాధించడంలో యువతే కీలక పాత్రధారులని చెప్పారు. విద్యార్థులు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని, ఆ సమస్యల పరిష్కారానికి నూతన ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. అనంతరం వారం రోజుల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.