28-08-2025 04:15:25 PM
జనగామ (విజయక్రాంతి): పట్టణ కేంద్రంలో సుందరీకరణలో గిరిజన మహానీయుడు జాటోత్ తాను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలని సేవాలాల్ సేన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. జనగామ పట్టణ అభివృద్ధిలో గిరిజన మహానీయుల గుర్తింపు అనివార్యం. జాటోత్ తాను నాయక్ విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ జిల్లా వాసులైన మహానీయులు సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఇప్పటికే ఏర్పాటు చేయబడుతున్నట్లు తెలుసుకున్నాం.
అదేవిధంగా జిల్లాకు చెందిన గిరిజన సామాజిక వర్గపు మహానీయుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి నిర్మూలన కోసం తన ప్రాణాలను అర్పించిన జాటోత్ తాను నాయక్ విగ్రహం కూడా ఈ సుందరీకరణ ప్రణాళికలో భాగంగా ప్రధాన స్థలంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సేవాలాల్ సేన వినతి పత్రం అందజేశారు. జాటోత్ తాను నాయక్ గిరిజన ఉద్యమానికి అగ్రగామి నాయకుడిగా, నేటి యువతకు ప్రేరణగా నిలిచిన మహానీయుడని, ఆయన విగ్రహం ఏర్పాటు ద్వారా గిరిజనుల చరిత్రకు గౌరవం చేకూరుతుందని సేవాలాల్ సేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ మహేందర్. జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ బిక్షపతి, కొర్ర రంగయ్య భూక్య రాజు నాయక్ జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ ధరావత్ ప్రకాష్ , చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ బానోత్ బిక్షపతి కార్యదర్శి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.