28-08-2025 06:49:58 PM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): కాజీపేట ఫాతిమానగర్ లోని బాలవికాస కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ సన్నాక సమావేశంలో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల భాగస్వామ్యంతో దామెరలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ డైరీ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు, పాలు ఉత్పత్తి రంగంలో స్థిరమైన ఆదాయం లభిస్తుంది అని, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మహిళలు సాధించలేనిది ఏమీ లేదని, మహిళలలో కమిట్మెంట్ ఉంటుందన్నారు.
మనం ఏర్పాటు చేయనున్న డైరీ కి ప్రభుత్వ సహాయం ఉందని, మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే డైరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలంటే పాడి పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. మహిళల పెట్టుబడి, ధైర్యం, నీతి, నిజాయితీ, నిబద్ధత అని ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. ముల్కనూరు మహిళా సమాఖ్య డైరీ నిర్వహణలో ప్రవీణ్ రెడ్డి, జిఎం భాస్కర్ రెడ్డి సహకారంతో ముందుకెళ్దాం అన్నారు. రాష్ట్ర, దేశ ఆర్థిక స్థితిని నిర్దేశించే స్థాయిలో డ్వాక్రా గ్రూపులు ఉందన్నారు. లాదెళ్ల, సంగెంలో ఏర్పాటు చేయనున్న మహిళా శిక్షణ కేంద్రాలు మహిళల ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తాయన్నారు. ట్రైనింగ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.