24-04-2025 01:04:27 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 23 : మండల కేంద్రంమైన జిన్నారంలోని శివుని విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం మదర్సాలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన హిందువులు మదర్సా వద్ద చేపట్టిన ఆందోళనలతో జిన్నారంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి పోలీసులు బలగాలు భారీగా మొహరించాయి. 163 సెక్షన్ విధించారు.
జిన్నారం గ్రామాన్ని పోలీసులు తమ అదీనంలోకి తీసుకున్నారు. ఐదు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎవరిని కూడా జిన్నారం వెళ్లేందుకు అనుమతించడం లేదు. జిన్నారం గ్రామానికి చెందిన వ్యక్తులను ఆధార్ కార్డులు చూసి అనుమతిస్తున్నారు.
ఊట్ల శివారులోని గడ్డ రైస్ మిల్ వద్ద, పెద్దమ్మ గూడెం చౌరస్తాలోని శివాజీ విగ్రహం వద్ద, జంగంపేట వైపు జిన్నారం శివారులో, రంగరాముల గుట్ట సమీపంలో, నర్రిగూడెం సమీపంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఐజీ సత్యనారాయణ జిన్నారం వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మంగళవారం రాత్రి నుంచి జిన్నారంలోనే ఉన్నారు.
అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ ఫోర్స్ చెక్ పోస్టుల వద్ద మొహరించారు. తహసీల్దార్ భిక్షపతి, ఆర్ఐ జయప్రకాశ్ నారాయణ పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, ఇతర బీజేపీ నాయకులు రామచంద్రాపురం, కిష్టారెడ్డిపేట నుంచి జిన్నారం వచ్చేందుకు ప్రయ త్నించగా అమీన్ పూర్ సీఐ నరేశ్ పోలీస్ సి బ్బందితో కలిసి కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ సర్సీసు రోడ్డపై అడ్డుకున్నారు.
దీంతో బీజేపీ నాయకులు రోడ్డుపై భైటాయించగా పోలీసులు అరెస్టు చేశారు. వీహెచ్పీ ఆల్ ఇండి యా మఠ మందిర్ ప్రముఖ్ రామరాజు, అధికార ప్రతినిధి శశిధర్, రాష్ట్ర ధర్మ ప్రచార ప్రముఖ్ సుభాష్ చంద్ర వీహెచ్పీ కార్యకర్తలతో కలిసి జిన్నారం వస్తుండగా పెద్దమ్మ గూడెం చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్ పో స్టు వద్ద అడిషనల్ ఎస్పీ సంజీవరావు అడ్డుకొని పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తర లించారు. కూరగాయలు అమ్మే వారిని జిన్నారానికి పోలీసులు అనుమతించకపోవడంతో బుధవారం అంగడిజరుగలేదు.