10-09-2025 01:54:45 AM
ఖైరతాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో జరిగిన గ్రంథాలయో ద్యమంలో, భాషోద్యమంలో ప్రజా కవి కాళోజీ కీలక పాత్ర పోషించారని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జయంతి వేడుకలు, తెలంగాణ భాష దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జూపల్లి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
కాళోజీ తన జీవితకాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్నీ ఊపిరిగా మార్చుకుని, వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారని చెప్పారు. సమకాలీన సమాజంపై ఆయన ప్రభావం అపారమైనదని, మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు లాంటి వారు కాళోజీ అంటే అమితమైన గౌరవాభిమానాలు చూపేవారని తెలిపారు. సమాజ గొడవను తన గొడవగా మార్చుకుని ‘నా గొడవ’ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకాలుగా మారాయని గుర్తుచే శారు.
ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప ప్రజాకవి అని, ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించి, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన మహా నుభావుడని కొనియాడారు. ఇంత గొప్ప కార్యక్రమాలకు యువత దూరంగా ఉండ టం బాధాకరమని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కాళోజీ జీవిత చరిత్ర గ్రంథాలను అందరికీ తెలియజేసేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రంథాల యాల్లో, గ్రామాల్లో ఉండే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాళోజీ ఫౌండేషన్ సభ్యుడు పొట్లపల్లి శ్రీనివాసరావు, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు.