10-09-2025 01:57:17 AM
వివిధ ఛార్జీల పేరుతో విడతల వారీగా వసూలు
మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): సులభంగా, ఎలాంటి పత్రాలు లేకుండా వ్యక్తిగత రుణం ఇస్తామం టూ సైబర్ నేరగాళ్లు వేసిన వలలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. లక్ష రూపాయల రుణం ఆశ చూపి, ఏకంగా మూడు లక్షల రూపాయలు కాజేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్ర హించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఘటన హైదరా బాద్ యూసఫ్గూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని యూసఫ్గూ డకు చెందిన ఓ యువకుడికి కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ఓ ప్రముఖ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు, అతనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎలాం టి డాక్యుమెంట్లు, గ్యారెంటీలు అవసరం లేకుండానే రూ. లక్ష వ్యక్తిగత రుణం తక్షణమే మంజూరు చేస్తామని నమ్మబలికారు.
వారి మాయమాటలు నమ్మిన యువకుడు రుణం కోసం అంగీకరించాడు. ఇక అప్పటి నుంచి అసలు మోసం మొదలైంది. లోన్ ప్రాసెస్ చేయడానికి ముందుగా బీమా ప్రీమియం చెల్లించాలని కొంత మొత్తం వసూలు చేశారు. ఆ తర్వాత టీడీఎస్, జీఎస్టీ, ఆర్బీఐ ఛార్జీలు అంటూ రకరకాల పేర్లు చెప్పి విడతల వారీగా బాధితుడి నుంచి సుమారు రూ. 3 లక్షల వరకు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
అయినా రుణం మంజూరు కాకపోగా, చివరిగా మరికొన్ని ఇతర ఛార్జీలు చెల్లిస్తేనే లోన్ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుందంటూ మళ్లీ డబ్బులు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి, వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యా ప్తు చేస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్, సందేశాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచి స్తున్నారు.