04-08-2025 11:23:19 AM
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ పై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను(Kaleshwaram Commission Report) అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఆనకట్టల నిర్మాణ నిర్ణయం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని కమిషన్ తేల్చింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి కూడా పక్కకు పెట్టారని కమిషన్ ఆరోపించింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతక కారణం కాదని కమిషన్ పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదని ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది.
వ్యాప్కోస్ నివేదిక, డీపీఆర్ కంటే ముందు బ్యారేజీలకు సిద్ధం అయ్యారని సూచించింది. రూ.71 వేల అంచనాలతో ప్రధానికి అప్పట్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Kalvakuntla Chandrashekar Rao) లేఖ రాశారని కమిషన్ పేర్కొంది. టెండర్లు, ఓఅండ్ఎం డిజైన్, నాణ్యతలో లోపాలున్నాయని కమిషన్ తెలిపింది. బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్ దేనని కమిషన్ తేల్చిచెప్పింది. జవాబుదారీతనం, పాలనాపరమైన విధానాలు పాటించలేదని పేర్కొంది. ఆర్థిక జవాబుదారీతనాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) పాటించలేదని కమిషన్ సూచించింది. కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నప్పటికీ వారితో సంబంధం లేదని ఈటల రాజేందర్ చెప్పారని తెలిపింది. ప్రణాళిక, నిర్మాణం, ఓఅంట్ ఎం, నీటి నిల్వ, ఆర్థిక అంశాలకు అప్పటి సీఎందే బాధ్యతని కమిషన్ పేర్కొంది.