01-07-2025 02:32:29 AM
బీజేపీ అధ్యక్ష అభ్యర్థి ఖరారుతో తేటతెల్లం
భవిష్యత్తులో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి ఎంపిక విషయంలో కేసీఆర్ ఎత్తుగడ ఫలించిందని, బీజేపీ దోస్తానీ మరోసారి బహిర్గతం అయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. కేసీఆర్ సూచనల మేరకే బలహీన నాయకుడు రామచంద్రరావును బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ సాఫీగా జరగడం కోసమే రామచంద్రరావు ఎంపిక జరిగిందని ఆరోపించారు.
సోమవారం సీఎల్పీ కార్యాలయంలో విప్ ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అంటేనే అగ్రవర్ణాల పార్టీ అని, కేసీఆర్ ఆలోచనలు, డైరెక్షన్లో బీజేపీ పని చేస్తోందని, దీనికి నిదర్శనమే రామచంద్రరావు ఎంపిక అని విమర్శించారు. గతంలో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించారని, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి కుట్ర జరిగిందని కవితనే స్వయంగా బయటపెట్టిందని గుర్తు చేశారు.