కిలో వెండి @ 3,87,000
న్యూఢిల్లీ, జనవరి ౨౭: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. సోమవారం కిలో వెండి ధర రూ.3,75,000 పలికిన ధర, మంగళవారానికి రూ.12,000 పెరిగి రూ.3,87,000 పలికింది.
24 గంటల వ్యవధిలోనే వెండి ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. అలాగే సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,260 పలికింది. మంగళవారం నాటికి ఈ ధర రూ.2,890 పెరిగి రూ.1,63,150కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం తల్లిదండ్రులపై పెనుభారాన్ని మోపుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.1.75 లక్షలు, వెండి రూ.4 లక్షలకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.






