24-07-2025 12:05:55 AM
డిచ్పల్లి జులై 23:(విజయ్ కాంత్రి): తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ టి యాదగిరిరావు అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పున్నయ్య రాసిన సంభాషణ సమాలోచన పుస్తకాలను ఆవిష్కరించినారు. అనంతరం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల ఆచార్యులు తరగతి గదికి మాత్రమే పరిమితం గాక సామాజిక మార్పు కొరకు సాంప్రదాయ విధానాలకు భిన్నంగా అధ్యాపనలో విభిన్న కోణాలు ఎంచుకొని తదనుగుణంగా తమదైన మార్గంలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అత్యంత ఆవశ్యకం.
ఈ దిశలో తెలంగాణ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య ప్రాథమిక స్థాయి నుండి స్నాతకోత్రర స్థాయి వరకు బలమైన తరగతి గది నిర్మాణానికి తపన పడుతున్నాడనిపేర్కొన్నారు. డాక్టర్ పున్నయ్య వివిధ సందర్భాలలో వ్రాసిన ఆర్థిక సామాజిక అంశాల సంకలనాలు సమాలోచన సంభాషణ పుస్తకాలను ఆవిష్కరించడం రెండు రోజులపాటు జరిగిన జాతీయ సదస్సులో ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందన్నారు.
ఈ ఆవిష్కరణలో పాల్గొన్న సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ. రేవతి మాట్లాడుతూ పున్నయ్య రచనలు అనేక ఆర్థిక సామాజిక అంశాలను స్పృషిస్తున్నాయన్న అన్నారు. ఇవాల్టి సామాజిక స్థితిలో ఈ రచనలు చాలా అవసరమైనవి అని తప్పనిసరిగా అందరూ చదవవలసిన వని పేర్కొన్నారు.
ఈ వ్యాసాలు రచయిత రచనాశక్తిని నిరూపించుకోవడానికి రాసినవి కావని ఒక సున్నితమైన ఆలోచన పరుడి స్పందనలు వివరణలు విశ్లేషణలు అని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ పున్నయ్య సామాజిక నిబద్దతగల రచయితగా, అధ్యాపకుడిగా నిశిత పరిశీలనా దృష్టి కలవాడన్నాడు. ప్రజాస్వామిక వాది,
అసంబద్ధ విధానాలపై దిక్కారస్వరాన్ని వినిపించగలవాడని ఉపాధ్యాయ వృత్తి నుండి అధ్యాపక స్థాయికి ఎదిగిన పున్నయ్య అనతి కాలంలోనే అర్థశాస్త్ర నిపుణుల సరసన చేరి అనేక విషయాలను అవగతం చేసుకొని చర్చిస్తూ బాధ్యతగల రచయితగా ఎదగడం అభినందనీయమన్నారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకులు పున్నయ్యకు అభినందనలు తెలియజేశారు.