26-12-2025 02:49:29 AM
బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించి, గొంతు నులిమి హత్య
కరీంనగర్జిల్లాలో వెలుగులోకి..
కరీంనగర్ క్రైం, డిసెంబరు 25 (విజయక్రాంతి): వివాహితుడిని ప్రేమిస్తున్నదన్న కారణంతో తమ కూతురుకు తల్లిదండ్రులు బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివరాంపల్లికి చెందిన రెడ్డి రాజు, లావణ్య కుమార్తె అర్చన(16) గత నెల 14న కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అర్చన అదే గ్రామానికి చెందిన వివాహితుడితో ప్రేమలో ఉన్నదని, పరువు పోతుందనే తల్లిదండ్రులు గతనెల 14న నిద్రలో ఉన్న అర్చనతో బలవంతంగా పురుగుల మందు తాగించి, గొంతునులిమి హత్య చేశారని తేలింది. దీంతో గురువారం నిందితులను హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.