మార్కెట్ కమిటీ ఆదాయం పెంపునకు కృషి చేయాలి..
నిజాంసాగర్ (విజయక్రాంతి): మార్కెట్ కమిటీ ఆదాయం పెంపునకు సిబ్బంది ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్(Market Committee Chairman Chikoti Manoj Kumar) సూచించారు. మంగళవారం సాయంత్రం పిట్లం మార్కెట్ కమిటీ పరిధిలోని మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిస చౌరస్తా వద్ద గల మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ... ప్రతిరోజు చెక్ పోస్ట్ గుండా ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయని వాటికి అన్ని రకాల టాక్స్లు సక్రమంగా ఉన్నాయా లేదా తనిఖీ చేస్తూ మార్కెట్ కమిటీ ఆదాయం పెంచడానికి సిబ్బంది ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఉన్నారు.






