07-10-2025 05:57:59 PM
నిరసన వ్యక్తం చేసిన తుంగతుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు..
తుంగతుర్తి (విజయక్రాంతి): సనాతన ధర్మం కాలం చెల్లిందని తన అభిప్రాయం చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం దారుణమని, సనాతన ధర్మం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపర్తి జ్ఞాన సుందర్ అన్నారు. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్ఞాన సుందర్ మాట్లాడుతూ... దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయిపై ఒక న్యాయవాది బూటుతో దాడి చేయడం సమాజానికి సిగ్గుచేటు అన్నారు.
ఇది భారత రాజ్యాంగంపైనే బూటు వేయడం అన్నారు. 75 ఏళ్ల రాజ్యాంగ పాలనలో గవాయి షెడ్యూల్ కేటగిరి నుంచి రెండోసారి దేశానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యారన్నారు. అది కూడా పూర్తిగా సొంత అర్హతతతోనే అన్నారు. ఈ ఘటన దేశంలోని మొత్తం షెడ్యూల్ కులాలపై దాడిగా చూడాలన్నారు. రాజ్యాంగాన్ని విశ్వసించే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనపై ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కారింగుల వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ పర్వీన్, జాయింట్ సెక్రెటరీ మల్లెపాక రవికుమార్, న్యాయవాదులు జిల్లా కుమారస్వామి, తాళ్లపల్లి సత్యనారాయణ, వంగాల నాగరాజు, ఓర్సు రాజు, షేక్ వజీర్, గుగులోతు రాజారాం, పులిచెర్ల శ్రీనివాస్, బానోతు ప్రతాప్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.