03-05-2024 12:53:53 AM
ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో రాహుల్ డిమాండ్
ప్రజ్వల్ రేపిస్టు అని బీజేపీ నేతలకు తెలుసు
అయినా జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు
శివమొగ్గ (కర్ణాటక), మే 2: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. జేడీఎస్ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో ప్రధాని మోదీ దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఇక్కడ అతిపెద్ద సమస్య ప్రజ్వల్ రేవణ్ణ కేసు. అతడు 400 మహిళలపై అత్యాచారం చేశాడు. అలాంటి వాడిని ఎన్నికల్లో మోదీ వెనుకేసుకొచ్చారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలి. దేశంలోని మహిళలందరికీ మోదీ క్షమాపణలు చెప్పాలి’ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. గురువారం కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసు సెక్స్ కుంభకోణం కాదని, ఇదో సామూహిక అత్యాచారం అని దుయ్యబట్టారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ పెద్ద రేపిస్టు అనే విషయం ప్రతి బీజేపీ నేతకు తెలుసు. అయినప్పటికీ అతడికి మద్దతు ఇచ్చారు. జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు’ అంటూ మండిపడ్డారు.
మోదీకి చిరాకులేస్తోంది..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తామని తాను చెబుతుంటే ప్రధాని మోదీరీ చిరాకు కలుగుతోందని రాహుల్ అన్నారు. తన ధనిక స్నేహితులకు ఈ డబ్బులు ఎక్కడ ఇవ్వలేపోతానోనని ఆయనకు భయం పట్టుకుందని దుయ్యబట్టారు. ఇక బీజేపీ యువత కు నిరుద్యోగం ఇచ్చిందని, తాము మాత్రం వారికి ఉపాధి హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.