calender_icon.png 14 September, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అస్సాంలో పర్యటించనున్న మోడీ

14-09-2025 09:54:40 AM

గౌహతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆదివారం అస్సాంలో పర్యటించనున్నారు. అస్సాంలోని దరంగ్, గోలాఘాట్ జిల్లాల్లో రూ.19 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళ్‌దాయి పట్టణంలో దరంగ్ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కళాశాల, జిఎన్‌ఎం పాఠశాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు కలిపి రూ.570 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని కామ్రూప్, దరంగ్ జిల్లాలను, మేఘాలయలోని రిభోయ్‌ను కలిపే 2.9 కి.మీ పొడవైన నరేంగి-కురువా వంతెన, 118.5 కి.మీ పొడవైన గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

రింగ్ రోడ్ ప్రాజెక్టు ఖర్చు రూ.4,530 కోట్లుగా అంచనా వేయబడింది. మంగళ్‌ దాయిలో ప్రధాని కార్యక్రమం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. అస్సాంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గువాహటి చేరుకున్న ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత, మోడీ గోలాఘాట్ జిల్లాలోని నుమాలిఘర్‌కు బయలుదేరి, అక్కడ 50 KTPA ఇంధన-గ్రేడ్ ఇథనాల్ సామర్థ్యంతో కొత్తగా నిర్మించిన రూ.5,000 కోట్లకు పైగా వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. 

360 KTPA ప్రొపైలిన్‌ను ఉత్పత్తి చేసే రూ.7,230 కోట్ల పెట్రో ఫ్లూయిడైజ్డ్ కాటలిటిక్ క్రాకర్ యూనిట్‌ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. నుమాలిఘర్‌లో జరిగే కార్యక్రమం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభం కానుంది. మంగళ్‌దై, నుమాలిఘర్‌లలో జరిగే బహిరంగ సభలలో కూడా మోదీ ప్రసంగించనున్నారు. ఆదివారం సాయంత్రం జోర్హాట్ విమానాశ్రయం నుండి ప్రధాని కోల్‌కతాకు బయలుదేరి వెళ్తారు.