30-09-2025 12:48:00 AM
రంగారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఆశావహుల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాయి. ప్రస్తుత రిజర్వేషన్లను చూసి పలువురు నేతలు భంగపడ్డారు. హతవిధీ అని కూనిరాగాలు తీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మొదలుకొని ఎంపీ ఎన్నికల వరకు కష్టపడ్డ నేతలంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా పదవి దక్కకపోతుందా?
అని జిల్లా, మండల, గ్రామస్థాయి మొదలుకుని పలువురు పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. జనరల్, రిజర్వేషన్ల స్థానాల్లో ఏదో ఒకటి అవకాశమి వస్తే తప్పకుండా బరిలో నిలిచి పదవిలో కూర్చోవాలని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ మండల, గ్రామాల ప్రస్తుతం రిజర్వేషన్లు తమకు అనుకూలంగా లేకపోవడంతో వారి ఆశలన్నీ ఆవిర్లు అయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది.
ఎవరిని కదిలించిన కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ముచ్చటా అంతా ఉంది.స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు తేలడం, ఎన్నికల షెడ్యూలు రావడం ప్రస్తుతం పల్లెల్లో దసరా పండుగ ముందు ధూమ్ ధామ్ నడుస్తుంది. మరోపక్క రిజర్వేషన్లు కలిసిరాని నేతల బాధలు వర్ణనాతీతం ఎవరిని కదిలించిన కూడా తమ కడుపులోని బాధ వ్యక్తపరుస్తూ వేదాలు వల్ల వేస్తున్నారు మెజార్టీగా సీనియర్ నేతలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు చుక్కెదురైందని చెప్పొచ్చు.
నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక అభ్యర్థిత్వం ఖరారు చేసుకునేందుకు ఆశావహులంతా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వాలంటూ తమకు అనుకూలంగా ఉన్న నేతలను వెంటబెట్టుకొని వెళ్లి వారిని వేడుకుంటున్నారు. ఈ దపా తమకే టికెట్ వచ్చేలా రాజకీయ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ పెద్దలు ఆశీర్వాదం, ఎమ్మెల్యే ఎంపీ మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రస్తుతం నిమగ్నమయ్యారు.
రెండు రోజుల నుంచి కాళ్లకు బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. పార్టీనే కొన్నేళ్లుగా నమ్ముకొని ఉన్నామని, తమ నియోజకవర్గంలో పార్టీని అధికారంలోకి తమ వంతు ప్రయత్నం చేశామని, తమకున్న ఓటు బ్యాంకు, సామాజికపరమైన లెక్కలను వారి ముందు ఉంచి తమకే మద్దతు ఇచ్చేలా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.
గెలుపు గుర్రాల కోసం..
రాజకీయ కదనరంగంలో ప్రత్యర్థిని మట్టుబెట్టాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. అభ్యర్థి ఖరారు మొదలుకుని సామాజిక అంశాలు, స్థానికంగా పార్టి కి ఉండే సానుకూల అంశాలు, ఆర్థిక అంశాలు, అభ్యర్థి పట్ల స్థానికుల్లో ఉండే అభిప్రాయం ఇలా అన్ని అంశాలపై పార్టీ నేతలు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా జర్నల్ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు అభ్యర్థుల ఖరారుపై పార్టీల నేతలకు కత్తి మీద స్వాములా తయారైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో మహిళలకు అధిక ప్రాధాన్యత పెరిగింది. జనరల్ స్థానంలో అవకాశం లేని నేతలంతా తమ భార్యను లేదా బంధువర్గాన్ని ఎన్నికల బరిలో రణరంగంలో దింపాలనే ఎత్తుగడలు వేస్తున్నారు.
తమ ప్రత్యర్థులకు దీటుగా ఎన్నికల బరిలో ఎవరిని నిలబడితే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయనే లెక్కలు కడుతున్నారు. తమ కుటుంబంలో ఎవరిని బరిలో నిలవాలని మంతనాలు అయితే ప్రస్తుతం సాగిస్తున్నారు.