13-09-2025 02:43:48 PM
శిథిలావస్థల స్థానంలో కొత్త భవనాలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా రూ.232 కోట్లతో అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టామని రోడ్లు భవనములు, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్ స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ హెడ్క్వార్టర్ తర్వాత 32 మండలాలతో నల్గొండ పెద్ద జిల్లాగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సెలవులు, పండుగలు లేని ఉద్యోగం పోలీస్ ఉద్యోగమని, వారి సేవలకు సమాజం గౌరవం ఇవ్వాలని అన్నారు.
డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు డ్రగ్స్ రాకుండా అడ్డుకునే దిశగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏ ఎస్ పి మౌనిక, తదితరులు ఉన్నారు.