12-09-2025 06:17:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కవులను గుర్తించాలని జిల్లా కవులు, రచయితలు అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. జిల్లాలో వచన కవిత్వం, పద్య కవిత్వం, వ్యాసాలు, కథలు, కథానికలు, తాత్విక వ్యాసాలు రాసిన చేయి తిరిగిన కవులు రచయితలు ఎంతో మంది ఉన్నారన్నారు. వారి రచనలు జాతీయ ,అంతర్జాతీయ స్థాయిల్లో ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్స్ రే, రంజని కుందర్తి, సినారే అవార్డులు అందుకున్న కవులు కూడా ఇక్కడ ఉన్నారని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా సాహిత్యాన్ని శ్వాసగా చేసుకొని రచనలు రాస్తున్నారన్నారు.
కానీ ప్రభుత్వం వీరిని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఒకటి రెండు బుక్కులు రాసిన కవులకు ఆదరిస్తుంది కానీ , దశాబ్దాలుగా ఎన్నో బుక్కులను రాసిన వారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మమ్మల్ని వెనుకబడిన జిల్లా వాసులుగా అవార్డుల కమిటీ చూస్తుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోరాట యోధుల గడ్డా అని, ఈ జిల్లాను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ జిల్లాలో ఎంతోమంది కవులు, రచయితలు ఉన్న గుర్తింపు లేదన్నారు. ఇప్పటికైనా అవార్డుల కమిటీ దృష్టి పెట్టాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కవులను పరిగణలోకి తీసుకొని గద్దర్, దాశరథి అవార్డులను అందజేయాలని కోరారు.